పటాన్చెరులో గెలిచామనే తీపి, మన ప్రభుత్వం రాలేదని చేదు ఉంది అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది తమకు తీపి చేదుల ఉగాది పచ్చడిగా తెలిపారు. ఇవాళ(ఆదివారం) జరిగిన పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మనపై ఎంతో నమ్మకం ఉందని, అందుకే కేవలం 1.8 శాతం ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు.
కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం, ప్రగతి భవన్, కొత్త సచివాలయం నిర్మాణాలను కాంగ్రెస్ దుష్ప్రచారానికి వాడుకుందని వివరించారు.ప్రగతి భవన్లో 150 రూములు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ అప్పట్లో ఆరోపించారని . ఇప్పుడు ఎన్ని ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా అడిగితే తల కిందికి వేసుకున్నారన్నారు.. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని, అంతే తప్ప ప్రభుత్వాన్ని కూల్చాలని, తాము అధికారంలో రావాలని కోరుకోవడం లేదని చెప్పారు. హామీలో విషయంలో కాంగ్రెస్ ప్రకటివంచిన తేదీలలో అమలు కాలేదు కాబట్టే ప్రశ్నిస్తున్నామన్నారు హరీశ్ రావు.
రైతుబంధు ఇస్తున్నామని తాను చెబితే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసి ఆపించారని, కాంగ్రెస్ పెంచిన రైతుబంధును ఇవ్వకుండా మాట తప్పిందని, వడ్లకు బోనస్ ఇవ్వలేదని గుర్తు చేశారు. వృద్ధులకు 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి, చివరకు జనవరిలో 2 వేల పింఛన్ ఇవ్వకుండా ఒక నెల పింఛన్ ఎగ్గొట్టారని రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు.
ఎన్నికల కోడ్ వచ్చే లోపే ఎన్నికల హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ మెడలు వంచి డిమాండ్ చేద్దామని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు హరీశ్ రావు. ఇతర రాష్ట్రాల్లో హమీలు అమలు చేయకపోవడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వాలు పోయాయని, తెలంగాణలోనూ అదే జరగబోతోందని జ్యోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని..దానికి వేసే ఓటు నిరుపయోగమన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు. ఢిల్లీలో మన గొంతును బలంగా వినిపించాలంటే పార్లమెంటులో మనకు బలం ఉండాలని.. ఎన్నికల్లో సత్తా చూపాలని కోరారు.
బీజేపీ రాముడి పేరుతో ఓట్లు అడుగుతోందని, మహిపాల్ అన్న పటాన్చెరులో 150 గుళ్లు కట్టించారని, కేసీఆర్ యాదాద్రి గుడి కట్టించారని అంటూ ఆ పేరుతో తాము ఓట్లు అడగలేదన్నారు హరీశ్ రావు. ఆటో డ్రైవర్ల అవస్థలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, వారికి నెలకు 10 వేలు ఇచ్చేలా రేవంత్ సర్కార్ పై వత్తిడి తెస్తామన్నారు.
ఇది కూడా చదవండి:కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మీదున్న శ్రద్ధ.. నిరుద్యోగులపై లేదా రేవంత్ రెడ్డి ?