మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొత్తకోట దయాకర్రెడ్డి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని పర్కాపురం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నుంచి దయాకర్రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు అమరచింత నుంచి, ఒకసారి మక్తల్ నుంచి ఆయన విజయం సాధించారు. అంతేకాకుండా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.
కాగా.. దయాకర్రెడ్డి మృతి పట్ల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కే దయాకర్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.
మాజీ శాసనసభ్యులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సంతాపం తెలిపారు. దయాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.