Saturday, May 18, 2024

మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం

spot_img

రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి (92) ఈ ఉదయం అస్వస్థతతో హైదరాబాద్‎లో కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‎కు చెందిన రామచంద్రారెడ్డి.. తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. సిటీ కాలేజీలో పట్టభద్రులైన రామచంద్ర రెడ్డి.. అనంతరం రాజకీయాల్లో పూర్తి కాలం పనిచేశారు. స్వగ్రామం చిట్టాపూర్ సర్పంచ్‎గా, దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‎గా, అప్పటి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా, దొమ్మాట శాసనసభ్యునిగా సేవలందించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా, రాజ్యసభలో ఆ పార్టీ నాయకులుగా, రాజ్యసభ హామీల అమలు స్థాయి సంఘం సభ్యులుగా, పలు హోదాల్లో విశిష్ట సేవలు అందించారు. ఇటీవలి కాలంలోనూ భారత-చైనా మిత్రమండలికి అధ్యక్షులుగా, సి. ఆర్. ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు వంటి సంస్థలకు సభ్యులుగా సేవలందించారు. 70 ఏళ్ల పాటు రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసి మచ్చలేని వ్యక్తిగా పేరుపొందారు. సోలిపేట రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి చిన్న కుమార్తెను తమ పెద్ద కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డికి చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని బంజారాహిల్స్‎లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‎లో 272 ఏలో ఉంచారు. ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్ మహాప్రస్థానంలో రామచంద్రారెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట జీవితం ఆదర్శవంతమైనది అని సీఎం తెలిపారు. ఆయన తన రాజకీయ జీవితంలో సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు. సిద్దిపేట ప్రాంత వాసిగా, రాజకీయ, సామాజిక రంగాల్లో వారు ఆచరించిన కార్యాచరణ, ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమ లాంటి ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచిందన్నారు. సోలిపేట రామచంద్రారెడ్డి మరణంతో తెలంగాణ మరో తొలితరం ప్రజానేతను కోల్పోయిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతిపట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తన సంతాపం తెలిపారు. సోలిపేట రామచంద్రారెడ్డి ఎప్పుడూ అభ్యుదయ శక్తులతో పయనిస్తూ ఉండేవారని అన్నారు. రామచంద్రారెడ్డి సీపీఐకి మంచి మిత్రుడన్న నారాయణ.. ఆయన కుటుంబసభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.

Latest News

More Articles