ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్లో ఎంప్లాయిల తీసివేత ఇంకా కొనసాగుతూనే ఉంది.. కాస్ట్ కటింగ్ పేరుతో పైథాన్ టీమ్ మొత్తాన్ని ఎత్తేసిన గూగుల్ లేటెస్ట్ గా దాదాపు 200 మందిపై వేటు వేసింది. వీరంతా కోర్ టీమ్లో సభ్యులని, గత నెల 25కు ముందే వీరందరిని తొలగించినట్లు తెలిపింది. కాలిఫోర్నియా, సన్నీవేల్లోని ఆఫీసుల్లోని ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారట. అమెరికా బయట తక్కువగా ఉద్యోగులు లభిస్తుండటంతో ఈ పోజిషన్లను భారత్, మెక్సికోకు బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..ఇప్పటికే పైథాన్, ఫ్లుట్టర్, డార్ట్ లపై పని చేసే బృందాల్లోని చాలా మంది ఉద్యోగులను గూగుల్ కంపెనీ తొలగించింది. వారికి కంపెనీలోనే ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించామంది.
ఈ ఏడాది ఇప్పటి వరకు టెక్ రంగంలో ఉద్యోగాల కోల్పోయిన వారి సంఖ్య 70 వేలు దాటినట్లు తెలుస్తోంది. ఉద్యోగులను తీసేసిన సంస్థల లిస్టులో టెక్ దిగ్గజాలైన గూగుల్తో పాటు అమెజాన్, యాపిల్, ఇంటెల్, టెస్లా వంటి సంస్థలు ఉన్నాయి. ఎలాన్ మస్క్ కు చెందిన కార్ల తయారీ సంస్థ టెస్లా పలు విభాగాల్లోని వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. అమ్మకాలు తగ్గడంతో ఖర్చులను అదుపులో ఉంచుకోనేందుకు ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగులను తొలగించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ చర్య చేపట్టిందని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి.
ఇది కూడా చదవండి: దండకారణ్యంలో కాల్పులు.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు హతం.!