గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక ఇప్పుడు తెలంగాణలో వివాదాస్పదం అవుతుంది. తాజాగా గవర్నర్ కోటాలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో దిగారు. వీరికి అనూహ్యంగా గవర్నర్ నుండి ఆమోదం కూడా లభించింది. దీంతో అందరు షాక్ అయిపోయారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య రహస్య ఒప్పందాన్ని మరింత బలం చేకూర్చింది. దాంతో ఈ ఎన్నికల తీరుని అందరు ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. గవర్నర్ తీరుపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందన్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయిందని అరోపించారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారన్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ నిరాకరించారు అని గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారని ఎద్దేవా చేశారు.