ఉత్తరప్రదేశ్లో హిందూత్వ మూకలు రెచ్చిపోయాయి. హోలీ పేరుతో ముస్లింలను వేధించిన ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యుపీలోని బిజ్నోర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. హోలీ వేడుకల పేరుతో హిందూత్వ మూకలు ముస్లిం వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలను వేధింపులకు పాల్పడ్డారు.
ఇద్దరు మహిళలతో బైక్పై వెళుతున్న ముస్లిం వ్యక్తిని హిందూత్వ మూకలు చుట్టుముట్టారు. స్ప్రేయర్తో మహిళలపై రంగు నీళ్లు చల్లారు. మహిళలు అరుస్తున్నప్పటికీ వారిని వేధిస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత బక్కెట్లతో రంగు నీళ్లు వారిపై పోశారు. కొందరు యువకులు ముస్లిం వ్యక్తితో పాటు ఓ మహిళ ముఖంపై బలవంతంగా రంగు పూశారు. ”ఇది 70 ఏళ్లుగా వస్తున్న హిందూ సాంప్రదాయం” అంటూ ఆ మూకలు నినాదాలు చేయడం కనిపిస్తోంది. ఆ తర్వాత జైశ్రీరామ్ అంటూ వారిని విడిచిపెట్టారు.
ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక పోలీసులను బిజ్నోర్ పోలీస్ చీఫ్ నీరజ్ కుమార్ జాదౌన్ ఆదేశించారు. ధాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని, నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనిరుధ్ అనే వ్యక్తితో పాటు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు…ఇప్పుడు ఏం చేస్తున్నారు