చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి కలెక్టర్ అయ్యాడు. కానీ, తనకు నచ్చిన దాని కోసం ఆ కలెక్టర్ జాబునే వదిలేసుకున్నాడు. ఉత్తర్ప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై మక్కువతో ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. నెట్ఫ్లిక్స్లో ప్రసారం అయిన ఢిల్లీ క్రైమ్ సీజన్- 2లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో నటించిన అభిషేక్ సింగ్ అందరినీ ఆకట్టుకున్నాడు. అందం, పొడవుతో హీరోలా ఉండే అభిషేక్.. 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన 2015లో యూపీ నుంచి డిప్యుటేషనుపై ఢిల్లీకి వెళ్లారు. గతేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన అభిషేక్.. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఎన్నికల అధికారి ఇలా తానే పరిశీలకుడిని అని బయటకు చెప్పడం విరుద్దం. దాంతో ఎన్నికల సంఘం ఆయనను ఆ విధుల నుంచి తప్పించి, సస్పెండ్ చేసింది. ఈ లోగా సినిమాలలో ఆఫర్లు రావడంతో.. ఆయన బిజీ అయిపోయారు. దాంతో తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా.. అభిషేక్ భార్య శక్తి నాగ్పాల్ కూడా ఐఏఎస్ అధికారి కావడం విశేషం. యమునా నగర్ ఇసుక అక్రమ రవాణా కుంభకోణం వ్యవహారంలో ఆమె చాలా కఠినంగా వ్యవహరించి.. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నది.