హైదరాబాద్: ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లటి వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ నెల 29 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉదయం వేళలో 40 – 46 డిగ్రీలు, మధ్యాహ్నం సమయంలో 43 – 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయాల్లో బయటకు రావొద్దని సూచనలు జారీ చేసింది. మరోవైపు ఎండల తీవ్రతతో రాష్ట్రవ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో వడదెబ్బకు ఏడుగురు చనిపోయారు.