బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ వ్యాఖ్యలు ఆపార్టీని ఇరుకున పెట్టాయి. అభివృద్ధికి ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పాలని.. ఆపై ఓట్లు అడగాలని బీజపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ నిలదీయటం చర్చనీయాంశంగా మారింది. శనివారం ఎమ్మెల్సీ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సొంతపార్టీపైనే విరుచుకుపడ్డారు.
ప్రధాని మోదీ వచ్చినప్పుడల్లా.. బడా హామీలు ఇచ్చిపోతారన్నారు. హామీలు వాస్తవంలో అమలు కావన్నారు. కర్ణాటకలో ఎన్ని సార్లు పర్యటించినా.. బీజేపీకి సొంతంగా అధికారం దక్కే పరిస్థితి లేదని విశ్వనాథ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా దక్షిణాది రాష్ర్టాల్లోనూ బీజేపీకి అధికారం కలగానే మిగిలిపోతుందని విశ్వనాథ్ అన్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్సీనే బీజేపీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలపై తీవ్ర విమర్శలు చేయడంపై ఎలా స్పందించాలో అర్థం కాక బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.