హైదరాబాద్: కేరళలో ‘ది కేరళ స్టోరీ’ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుందని కేరళ సీఎం పినరాయి విజయన్ అన్నారు. ఈ సినిమా విడుదలను నిషేధించాలని వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. డీజీపీ నివేదిక వచ్చిన తర్వాతనే కేరళలో సినిమా విడుదలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం విజయన్ స్పష్టం చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సరిగ్గా.. నాలుగు రోజుల ముందే మే 5న ఈ సినిమాను విడుదల చేయనుండటం కూడా పినరాయి వాదనలకు బలం చేకూర్చుతుంది. కాగా, ఈ సినిమా మున్ముందు మరింత వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ విస్తరణలో భాగంగా యువతలో మత విద్వేషాలను, వైషమ్యాలను రెచ్చగొట్టేందుకే ఇలాంటి(‘కశ్మీర్ ఫైల్స్’, ‘ ది కేరళ స్టోరీ’) సినిమాలను బీజేపీ ప్రమోట్ చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి.