డబ్బుకు విలువ పెరుగుతున్నా కొద్దీ.. మనిషి ప్రాణానికి విలువ తగ్గుతోంది. కేవలం డబ్బుల కోసమే తోటివారి ప్రాణాలు తీసేస్తున్నారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. గాండా గ్రామానికి చెందిన బీర్బల్.. మీరట్లోని జాగ్రతి విహార్ ఎక్స్టెన్షన్లో టీ షాపు నడుపుతున్నాడు. కాగా.. శుక్రవారం మధ్యాహ్నం ఏదో పని మీద బయటకు వెళ్తూ.. షాపులో తన తండ్రి ఓంకార్ను ఉంచాడు. ఆ సమయంలో ఇద్దరు యువకులు బుల్లెట్ మీద టీ షాపు వద్దకు వచ్చి.. సిగరెట్ కొనుగోలు చేశారు. దానికి రూ. 15 ఇవ్వాల్సిందిగా ఓంకార్ కోరాడు. మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ ఆయనతో యువకులు గొడవకు దిగారు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తులైన యువకులు.. గన్ తో ఓంకార్ మీద కాల్పులు జరిపారు. ఛాతీపై కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Read Also: సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్.. ఒంటిపై 500కు పైగా గాయాలు