పండుగలు వచ్చాయంటే చాలు.. ఎన్నెన్నో ఆఫర్లు దర్శనమిస్తుంటాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి చిత్ర విచిత్రమైన ఆఫర్లు పెడుతుంటారు. ఒక చీర కొంటే మరో చీర ఉచితం, 50 శాతం తగ్గింపు, షాపింగ్ చేసి కూపన్ ఉపయోగించి కార్లు, బైక్లను గెలుచుకోండి అంటూ భారీగా ఆఫర్ల వర్షం కురిపిస్తుంటారు. ప్రస్తుతం దసరా, దీపావళి పండుగల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రధాన దుకాణాల్లో భారీ ఆఫర్లు ప్రకటించారు. పండుగ షాపింగ్తో ప్రజలు బిజీబిజీగా ఉన్నారు. అయితే సూర్యాపేటలోని ఓ దుకాణం నిర్వాహకులు మహిళలకు అదిరిపోయే పండుగ ఆఫర్ ఇచ్చారు. పట్టణంలోని విఘ్నేశ్వర సిల్క్ సెంటర్ యజమానులు దసరా పండుగ సందర్భంగా తమ దుకాణాన్ని రీఓపెన్ చేశారు. ఇందులో భాగంగా కేవలం 10 రూపాయలకే పట్టుచీర అంటూ ఆఫర్ పెట్టారు. ఈ అద్భుతమైన ఆఫర్ రెండు రోజుల పాటు ఉంటుందని ప్రకటించడంతో మహిళలు చీరల కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఈ ఆఫర్ కింద ఇప్పటివరకు దాదాపు 600 చీరలను విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ వల్ల షాపు కిక్కిరిసిపోయిందని, కస్టమర్లు తమ షాపుకు ఎక్కువగా వస్తున్నారని దుకాణదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ వస్తుందంటున్నారు. రూ. 10లకే పట్టుచీరలు ఇస్తుండటంతో జిల్లాలో షాపు పేరు మారుమోగుతోందన్నారు.