Saturday, May 18, 2024

కాంగ్రెస్ కు లీడర్లు లేరూ…బీజేపీ కి క్యాడర్ లేదు..బీఆర్ఎస్ కు తిరుగులేదు

spot_img

త్వరలో జరిగే ఎన్నికల్లో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం అవుతారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మెదక్ జిల్లాలోని మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 23న సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలో పర్యటిస్తారు. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలతో పాటు బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి కూడా ప్రారంభోత్సవం చేస్తారు. కొన్ని రాష్ట్రాల అధికారులు, మంత్రులు వచ్చి సమీకృత కలెక్టరేట్‌ను పరిశీలించారని తెలిపారు. అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండడంతో సమస్యలు పరిష్కారించుకోవచ్చన్నారు.

మెదక్ జిల్లా అనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని, సీఎం కేసీఆర్ అయ్యాకే మెదక్ జిల్లా కల నెరవేరిందన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ఉంటే కలగానే ఉండేదని, కలలు కనడమే కాదు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది సీఎం కేసీఆరేనన్నారు. మన సంక్షేమ పథకాలు చెప్పినప్పుడు ఇతరులు ఆశ్చర్యపోయారని.. ఇందిరాగాంధీ మాట ఇచ్చి తప్పారని, జిల్లా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమన్నారు. మెదక్‌కు రైలును ఊహించలేదని, సీఎం కేసీఆర్ నిధులు ఇవ్వడంతోనే రైలు కల నెరవేరిందని చెప్పారు. మెదక్‌ కు మెడికల్ కాలేజీ వస్తదని కలలో కూడా అనుకోలేదని, మెదక్ పట్టణ రూపురేఖలు మారిపోయానన్నారు. 23న పండుగలాగా విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత చెప్పాలన్నారు. యావత్ మెదక్ జిల్లా ప్రజలు వచ్చి కృతజ్ఞతలు చెప్పి విజయవంతం చేయాలన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ఉంటుందని, ఈ సభ సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభ 9 ఏండ్లలో ఇంత అభివృద్ధి జరగడం కేసీఆర్ విజన్ కేసీఆర్‌ను ఆశీర్వదించాలన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు మంత్రి హరీశ్ రావు. మూడోసారి సీఎం అయ్యేది కేసీఆరేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి లీడర్లు లేరని, బీజేపీకి క్యాడర్ లేదని.. బీఆర్‌ఎస్‌కు తిరుగులేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని, 24 గంటల కరెంటు అంటే నమ్మలేదని, ఇచ్చి చూపించారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను తిట్టడంలో బీజీగా ఉంటే కేసీఆర్ వడ్లు పండించడంలో బిజీగా ఉన్నారన్నారు. నాలుగు లక్షల ఎకరాల్లో పొడుపట్టాలు ఇచ్చామని, 1.50 లక్షల కుటుంబాలకు పోడు పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు మంత్రి.

30 లక్షల కుటుంబాలకు రుణమాఫీ జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామన్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఆయన ఆదేశిస్తే ఆచరిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. రుణమాఫీ చివరి రూపాయి వరకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పథకాలను చూసి కాంగ్రెస్ నేతలు బేజారవుతున్నారన్నారు. కోటి ఎకరాలకుపైగా తెలంగాణలో సాగు దేశంలోనే అతి ఎక్కువ వరి ధాన్యం పండించడంలో తాము పోటీపడుతున్నామన్నారు. కేసీఆర్‌ను తిట్టడానికి ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయని,ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని కాంగ్రెస్ నేతలు చూస్తున్నాయన్నారు. బీజేపీ క్యాడర్ కోసం వెతుకులాడుతున్నారని విమర్శించారు. మైనార్టీలకు రూ.లక్ష చెక్కులు పంపిణీ చేశామన్నారు.

రా ష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 10వేల మందికి రూ.లక్ష చొప్పున ఇచ్చామని, బీసీ కులవృత్తులకు ఇచ్చామన్నారు. లక్ష మంది మైనార్టీలకు ఇవ్వడమే లక్ష్యమని.. మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 204 మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. మైనార్టీలకు కాంగ్రెస్ రూపాయి ఇవ్వలేదన్నారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా వేలాది మంది విదేశాల్లో చదువుకుంటున్నారని, తెలంగాణ సర్కార్ 9ఏండ్లలో రూ.10వేల కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేసిందన్నారు మంత్రి హరీశ్ రావు.

Latest News

More Articles