Saturday, May 4, 2024

ఆగస్టు 26 నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ

spot_img

రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇవాళ(శనివారం) డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాతో ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ కి సంబంధించి సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 26న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువులో చేప పిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ లాంచనంగా ప్రారంభిస్తారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలో చేప పిల్లల పంపిణీ ని ప్రారంభించాలని, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, MLC లు, MLA లు, ZP చైర్మన్ లు, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు 2017 సంవత్సరంలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మొట్టమొదటి సారి రాష్ట్రంలోని 3939 నీటి వనరులలో 27.86 కోట్ల చేప పిల్లలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది 26,357 నీటి వనరులలో 84.13 కోట్ల రూపాయల ఖర్చుతో 85.60 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు మత్స్యకారులకు అదనపు ఆదాయవనరుగా మారాలనే ఉద్దేశంతో రొయ్య పిల్లలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి తలసాని.

Latest News

More Articles