పోడు భూములపై గిరిజనులకు ఇక నుంచి సర్వ హక్కులు ఉంటాయన్నారు మంత్రి హరీశ్ రావు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీశ్ రావు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన.. ఇక నుంచి గిరిజనులే పోడు భూములకు యజమానులని, వారి భూముల జోలికి ఎవరూ రారన్నారు. గిరిజన రైతుల భూములకు పట్టాలతో పాటు రైతుబంధు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు మంత్రి.
అంతేకాదు..మీ పేరుతో ధరణిలో భూమి రికార్డవుతుందని తెలిపారు మంత్రి హరీశ్ రావు. ఇక ఈ భూముల వైపు అటవీ అధికారులు కన్నెత్తి కూడా చూడరన్నారు. గతంలో పోడు భూముల వివాదాలకు సంబంధించి గిరిజనులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తామన్నారు. ఈ భూములు వారసత్వంగా కూడా సంక్రమించే హక్కు కల్పిస్తామని.. పోడు భూములు పొందిన రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. రైతులకు అందే ప్రతి స్కీమ్ పోడు భూములకు వర్తిస్తుందని చెప్పారు. అకాల వర్షాలతో పంట నష్టపోతే పరిహారం అందుతుందన్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా కూడా గిరిజనులు అవకాశాలు పొందుతారు. గిరిజనులు బ్యాంకుల నుంచి పంట రుణాలు కూడా పొందవచ్చని చెప్పారు.
గిరిజనుల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి హరీష్ రావు. ఇప్పటి వరకు 22 మహిళా గిరిజన వెల్ఫేర్ కాలేజీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి గిరిజన తండాకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. గిరిజన బిడ్డలకు నాణ్యమైన వైద్యం అందిచేందుకు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ నిధి ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అని అన్నారు మంత్రి హరీశ్ రావు.