భారతీయ జనతా పార్టీ ప్రమాదకరమైన పార్టీ, దాని ఉచ్చులో యువత పడొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మతాల మధ్య పంచాయతీ పెట్టడం బీజేపీ పని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి లాంటి సన్నాసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేవన్ని అబద్ధాలు.. నిలదీస్తే ఒక్క సమాధానం కూడా చెప్పడని మండిపడ్డారు. బీజేపీ వల్ల కార్పొరేట్ శక్తులు బాగుపడ్డాయి. ప్రజలు మాత్రం మరింత అగాధంలోకి వెళ్లారు. మోదీ వల్ల దేశం అప్పులపాలైంది.. దేశం అభాసుపాలైందన్నారు. దేశానికి వేగు చుక్క మన తెలంగాణ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ కట్టిన డబ్బులు తీసుకెళ్లి.. ఇతర రాష్ట్రాల అభివృద్దికి వాడుతున్నారని మండిపడ్డారు. తాను చెప్పింది తప్పని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అని అన్నారు. లేకపోతే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. హుజుర్నగర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. భారతదేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రూ. 30 వేల కోట్లతో దామరచర్లలో అల్ట్రా మెగా వపర్ ప్లాంట్ను నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని స్పష్టం చేశారు.