Saturday, May 18, 2024

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాలది విషప్రచారం

spot_img

హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాల విషప్రచారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు మీద భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయన్నారు. దీనిని గమనించి కేసీఆర్ 216 టీఎంసీల సామర్ద్యంగల శ్రీశైలం ప్రాజెక్టు నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటిని తోడుకోవడానికి నిర్ణయించుకున్నారని తెలిపారు.

Also Read.. సుప్రీంకోర్టుకు చేరిన చంద్రబాబు కేసు

అవగాహన లేని విపక్షాలు ముందు జూరాల నుండి మొదలుపెట్టాలి అని వాదించారు. తర్వాత  అటవీ ప్రాంతం అని ఫిర్యాదులు పెట్టారు. తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది అని గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదులు చేశారు. తర్వాత రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. అనంతరం రైతుల పేరు మీద కేసులు వేయించారు. అన్ని అడ్డంకులను దాటుకుని ప్రాజెక్టులో మొదటి పంపు ప్రారంభించగానే ఇప్పుడు ఒక పంపుతో ఎలా మొదలు పెడతారని కొత్త రాగం ఎత్తుకున్నారని విమర్శించారు.

జూరాల కింద ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 32 గ్రామాలు, 85 వేల ఎకరాల సేకరణ ఉన్నది. రీ డిజైన్ చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేవలం 27 వేల ఎకరాల భూసేకరణ, 3 పెద్ద గ్రామాలు, 8 చిన్నతండాలు మాత్రమే ఉన్నాయి. తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనం మీద కేసీఅర్ దృష్టిపెట్టారు. కృష్ణా నదిలో ఎక్కువ నీటి లభ్యత ఉన్నది తుంగభద్ర బేసిన్. శ్రీశైలం నుండి పాలమూరు రంగారెడ్డి చేపట్టడం మూలంగా ఈ నీరు కూడా అందుబాటులో ఉంటుందని మంత్రి వివరించారు.

Also Read.. పార్టీ గెలుపుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద వీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ పనులు ఆగవు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు . వీరికి పాలమూరుకు నీళ్లు రావాలి, ప్రజలు, రైతులు, ప్రాంతం బాగుపడాలి అన్నదానికన్నా ప్రాజెక్టు విఫలం కావాలి అన్న ఆకాంక్ష ఎక్కువగా ఉన్నది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏవయినా అవరోధాలు వస్తే నీళ్లొస్తే బాగుపడతారు అని ప్రజలను జాగృతం చేసి సహకరించాలి. లోపాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

తెలంగాణ ఎత్తిపోతల పథకాలు అన్నీ  ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి నేతృత్వంలో పనులు నడుస్తున్నాయి. పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు 250 కి పైగా మోటార్లు బిగించబడ్డాయి. ఇతర దేశాల నుండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. కానీ సుధీర్ఘ అనుభవం ఉన్న ఇంజనీరు, తెలంగాణ గర్వించదగిన ఇంజనీరు అయిన పెంటారెడ్డి గారి మీద కూడా వీరు బురదజల్లుతున్నారని మండిపడ్డారు.

Also Read.. మహారాష్ట్రలో భారీ వర్షాలు.. నీట మునిగిన నాగ్‎పూర్

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క పంపునే ప్రారంభించారన్న ప్రాథమిక విషయం ఇప్పుడు విషం చిమ్ముతున్న నాయకులు విస్మరించారు. మిగతా కల్వకుర్తి ఎత్తిపోతల పంపులన్నీ తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలోనే పూర్తి చేసుకున్నాం. 60 ఏళ్లలో నష్టపోయిన పాలమూరు జిల్లా కేసీఆర్ నాయకత్వంలో నిలదొక్కుకుంటున్నది. పాలమూరుకు నీళ్లొస్తే మీ రాజకీయ జీవితాలు శాశ్వతంగా ఎక్కడ కూలిపోతాయోనని విషప్రచారం చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు.

Latest News

More Articles