తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని హరీశ్రావు అన్నారు. ఈ శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయం- తెలంగాణ వాటా కింద 1956-57 నుంచి 2013-14 వరకు 41.68 శాతం ఖర్చు చేసినట్లు గంపగుత్త లెక్క తీశారని తెలిపారు. ఈ లెక్కలు శుద్ద తప్పు అని హరీశ్ రావు కొట్టిపారేశారు. కావాలంటే దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మొత్తం లెక్కలు తీసి.. నిజానికి ఎంత ఖర్చయ్యిందో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
తమకు అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక.. రిటైర్డ్ అధికారి.. సస్పెండ్ అయిన ఏపీ అధికారులతో ప్రిపేర్ చేయించారని అన్నారు. ఆ వివరాలు, వాస్తవాలను అవసరం వచ్చినప్పుడు బయట పెడతామని తెలిపారు. ఈ మొత్తం రిపోర్టు చూస్తే.. ఏ అంశాల్లో గత ప్రభుత్వాన్ని తప్పు పట్టొచ్చో.. ఏ అంశాల్లో మెరుగ్గా ఉన్నామో చూపించాలో.. తమకు కన్వినెంట్గా ఉన్న దాన్ని బట్టి రెడీ చేయించినట్లు కనబడుతుందని హరీశ్రావు అన్నారు. గత పదేండ్లలో చాలా రంగాల్లో ప్రగతి సాధించిందని. అనేక విషయాల్లో మెరుగ్గా ఉన్నామని తెలిపారు. కానీ వాటిని ఈ రిపోర్టులో చూపించకుండా.. తమకు కన్వినెంట్గా తయారు చేయించారని విమర్శించారు.