కర్నాటకలో మంకీ ఫీవర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నట్లుగా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 31 మంది వరకు సోకగా.. ఇందులో 12 మంది ఆసుపత్రిలో చేరారు. మిగతా వారంతా ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని, ఇంత వరకు ఎలాంటి తీవ్రమైన కేసులు నమోదు కాలేదన్నారు. మంకీ ఫీవర్ మొదటి కేసు జనవరి 16న నమోదైంది. మంకీ ఫీవర్ను క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD) పేరుతోనూ పిలుస్తుంటారు.
ఇది జంతవుల నుంచి మనుషులకు సోకుతుంది. ముఖ్యంగా కోతుల్లో కనిపించే పేలు మనుషులను కాటు వేయడం ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. మంకీ ఫీవర్ దేశంలోని కర్నాటక, మహారాష్ట్ గోవాలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. మంకీ ఫీవర్ కొన్ని పరిస్థితుల్లో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందన్నారు ఆరోగ్య నిపుణులు. కేడీఎఫ్తో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంకీ ఫీవర్తో ఒక్కసారిగా ఆకస్మికంగా జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పి, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు తెలిపారు.
వ్యాధి తీవ్రత పెరుగుతున్న సమయంలో వాంతులు, విరేచనాలు తదితర సమస్యలుంటాయని తెలిపారు. మంకీ ఫీవర్ తీవ్రమైన సందర్భాల్లో ముక్కు నుంచి రక్తస్రావం, చిగుళ్ల నుంచి రక్తస్రావం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పారు. కొందరు వ్యక్తుల్లో వణుకు, అసాధారణంగా నడక, మానసిక గందరగోళం, కొత్తగా నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. మంకీ ఫీవర్ బారినపడిన సమయంలో లక్షణాలు ముందుగానే గుర్తించి సరైన చికిత్స సరైన చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే, ఈ కేఎఫ్డీకి నిర్ధిష్టంగా చికిత్స ఏమీ లేదు.
అయితే లక్షణాలను గుర్తించడం ద్వారా సంబంధిత సమస్యల ప్రమాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. మంకీ ఫీవర్ నుంచి తమను తాము రక్షించుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచించారు. కేఎఫ్డీకి వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. ఇవి ఇన్ఫెక్షన్ను నిరోధించడంలో సహాయపడతాయని వైద్య నిపుణులు తెలిపారు. మంకీ ఫీవర్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వ్యక్తులంతా పేల బారినపడకుండా ఉండేందుకు ఒంటిని కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి:కాంగ్రెస్ సీనియర్ నేత కుమార్తెపై కేసు నమోదు