తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా విసురుతున్నది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు వాతావరణశాఖ పేర్కొన్నది. దాంతో వచ్చే మూడు రోజులు చలి తీవ్రత మరింతగా ఉంటుందని హెచ్చరించింది. ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండలో 12.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబిలో 13.1, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 13.6, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9, పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో 13.9, మెదక్ జిల్లా దామరంచలో కనిష్ఠ ఉష్ణోగ్రత 14.3 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదివారం నుంచి పగటిపూట కూడా చలి గాలులు వీస్తున్నాయి.
Read Also: ప్రభుత్వ 6 గ్యారెంటీలకు లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తారంటే..
ఈ క్రమంలో వచ్చే రెండు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తున్నది. ప్రధాన రహదారులపై పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రెండురోజులపాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గ్రేటర్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16.7 డిగ్రీలుగా, గాలిలో తేమ 36 శాతంగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.