హైదరాబాద్ : ప్రస్తుతం నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డి.. మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీలో నిల్వనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ.. అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సునీతా లక్ష్మారెడ్డిని నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ-ఫామ్ అందజేశారు సీఎం. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Also Read.. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు లేవు.. రాష్ట్ర ఇంజినీర్లతో కేంద్ర బృందం భేటీ
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మదన్ రెడ్డి తనతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడని, 35 ఏండ్ల నుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడని పేర్కొన్నారు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు.