Sunday, May 19, 2024

మేడారం జాతర బస్సుల్లో మహిళలకు షాక్..!

spot_img

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రయాణికులకు చార్జీల మోత మోగనున్నది. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్‌ బస్సులనే నడుపాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. తద్వారా మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణాన్ని దూరం చేసేందుకు వ్యూహం రచించింది. జనవరిలో సంక్రాంతి పండుగ, ఫిబ్రవరిలో సమ్మక్క-సారలమ్మ జాతల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. అదే జరిగితే నష్టం తప్పదనే భయం ప్రభుత్వంలో నెలకొన్నది. దీంతో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో ప్రత్యేక బస్సులను నడిపించి చార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీని ఆదేశించినట్టు తెలుస్తున్నది.

మహాలక్ష్మి పథకం అమలులో టీఎస్‌ఆర్టీసీ అధికారులకు రోజుకో కొత్త అనుభవం ఎదురవుతున్నది. బస్సుల్లో ఉచిత ప్రయాణం కార్యక్రమం అమలుకు ముందు నిత్యం రూ.11 కోట్ల నుంచి రూ. 18 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో ఆక్యుపెన్సీ పెరిగినా, ఆదాయం భారీగా పడిపోయింది. రోజు సంస్థ ఆదాయం రూ.7 కోట్ల నుంచి రూ.9 కోట్లకు పడిపోయింది.

ప్రభుత్వం ఇస్తామని చెప్తున్న రీయింబర్స్‌మెంట్‌ చెల్లించే వరకూ ఈ భారాన్ని ఆర్టీసీ భరించాల్సి ఉన్నది. ఈ క్రమంలో సమక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే ఆర్టీసీ నిండా మునిగే ప్రమాదమున్నది. ఈ నేపథ్యంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం చెక్‌ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నది. పల్లెవెలుగు, ఆర్టీసీ బస్సులను తగ్గించి పూర్తిస్థాయిలో స్పెషల్‌ బస్సులను నడిపించాలని ఆర్టీసీని ఆదేశించినట్టు సమాచారం.

Latest News

More Articles