రేపట్నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. అయితే కొత్త పార్లమెంట్ భవనంలో మొదటిసారి ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవ్వాళ అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం మొదలుకానుంది. ప్రస్తుత లోక్సభకు చివరి సమావేశాలు కావడంతో మంచి వాతావరణంలో సమావేశాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. కీలక బిల్లులన్నింటికి గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో… ఓట్ ఆన్ అకౌంట్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులను ఆమోదానికి కేంద్రం తీసుకువస్తోంది. ఈ బిల్లులు అన్నీ ఇప్పటికే ఉభయ సభల్లో ప్రవేశ పెట్టినందున… ఆమోదం తెలిపేందుకు చర్చకు తీసుకురానున్నట్లు సమాచారం. కొత్తగా తీసుకువచ్చిన భద్రతా ఏర్పాట్లపై కూడ అన్ని పార్టీలకు వివరించనున్నట్లు సమాచారం. సభా కార్యకలాపాలకు సహకరించాలని ప్రభుత్వం అన్ని పార్టీలను కోరనుంది.