ఏపీలో దారుణం జరిగింది. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. టెన్త్ క్లాస్ మెమో తీసుకెళ్లేందుకు స్కూల్ కు వచ్చిన ఓ బాలికను సహచర విద్యార్థి తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు తమ మొబైల్లో వీడియో తీసి బెదిరింపులకు గురిచేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో బయటపడింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం మండవల్లి మండలంలో ఈమధ్యే విడుదలైన పదోతరగతి పరీక్షల్లో ఓ గ్రామానికి చెందిన బాలిక పాస్ అయ్యింది. ఈనెల 15న మెమో తీసుకునేందుకు స్కూల్ కు వెళ్లింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వస్తుండగా..అప్పటికే అక్కడ మాటువేసిన సహ విద్యార్థి బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను మరో నలుగురు విద్యార్థులు వీడియో తీశారు.
అనంతరం బాలికకు వీడియో చూపి తమ కోరిక తీర్చాలంటూ బలవంతం చేయడంతోపాటు తమకు డబ్బులు ఇవ్వాలంటూ బాధితురాలి తల్లిదండ్రులను కూడా బెదిరించారు. రూ. 2లక్షల ఇస్తామని వారు ప్రాధేయపడినా భారీ మొత్తంలో నగదును డిమాండ్ చేశారు. దీంతో వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేసి కైకలూరు కోర్టులో హాజరుపరిచారు. వారికి 14రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకోవడం లేదని ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్..