న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్కు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన రెండేళ్లలో ఎలాంటి లావాదేవీలూ జరపని ఖాతాల విషయంలో మినిమమ్ బ్యాలెన్స్ లేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులను ఆదేశించింది. ముఖ్యంగా విద్యార్థుల స్కాలర్షిప్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నగదు బదిలీ కోసం తెరిచిన ఖాతాలు రెండేళ్లకు మించి వాడుకలో లేకున్నా వాటిని నిరుపయోగ ఖాతాలుగా గుర్తించకూడదని సూచించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Also Read.. ధరణి ఉంటదా? ఉండదా? కాంగ్రెస్ సర్కార్కు హైకోర్టు ఆదేశం
ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. వాడుకలో లేని ఖాతాల గురించి బ్యాంకులు ఎస్సెమ్మెస్, లెటర్, లేదా ఇ-మెయిల్ రూపంలో ఖాతాదారులకు తెలియజేయాలి. 2023 మార్చి నాటికి బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.42,272 కోట్లకు చేరాయి. కాగా, ఈ తరహా డిపాజిట్లను వారసులు లేదా హక్కుదార్లు గుర్తించేందుకు వీలుగా UDGAM పేరిట ఓ కేంద్రీకృత వెబ్ పోర్టల్ను ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. అదే విధంగా 10 ఏళ్లపాటు డిపాజిట్ అన్క్లెయిమ్డ్గా ఉంటేనే వాటిని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్’ ఫండ్ పథకానికి బదిలీ చేయాల్సి ఉంటుంది.