బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైందువల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు జరిపారని బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిలో సోదాలు, అటుపై ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై ఆమె స్పందించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్లో ఉండగా, ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు.
ఇన్ని రోజులు పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడమేమిటని సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. ఈడీ అధికారులు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బలహీన పరిచేందుకు ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్ గా పెట్టుకున్నారని ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని తెలిపారు. దీనిపై ప్రజాక్షేత్రంలో రాజకీయంగానే ఎదుర్కొంటామని చెప్పారు. చట్టపరంగా న్యాయస్థానాల్లోనూ పోరాడతామన్నారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుందని చెప్పారు సత్యవతి రాథోడ్.
ఇది కూడా చదవండి: ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారు..?