వర్షాలు ఆలస్యం కావడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టడంతో నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కలెక్టర్ ద్రి తేష్ వి పాటిల్ పాల్గొన్నారు. ఈ నీటి విడుదలతో 1 లక్ష 30 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని మంత్రి తెలిపారు. ఆయకట్టు ప్రాంత రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయకట్టు చివరి క్యాచ్ మెంట్ ఏరియా వరకు రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రైతన్నలు సాగుకు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటలకు వానాకాలం సీజన్ కోసం నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1500 క్యూసెక్కుల నీటిని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ సాగర్లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. అవసరమైతే మరో 5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్ నుంచి తెప్పించి.. ఆయకట్టు కింద ఉన్న 1.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అంగీకరించారని వెల్లడించారు.
సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన స్పీకర్ పోచారం.. నిజాంసాగర్ ఆయకట్టు కింద నారు మడులు వేసుకున్నారని, ఇక్కడ ముందస్తు సాగు చేసుకుంటారని నీటిని విడుదల చేయాలని కోరారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్.. సాగర్ నుంచి నీటి విడుదలకు అంగీకరించారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూర్, వర్ని, నస్రుల్లాబాద్, కోటగిరి, చందూర్ మండలాల్లోని రైతులు వరి నారు పోసుకున్నారు. ఆయా భూములకు వరినాట్ల కోసం సాగర్ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని అందించనున్నారు. నాట్లతో పాటు మూడు తడులకు సరిపడా నీరు నిజాంసాగర్లో ఉన్నందున మూడు విడుతల్లో నీటని విడుదల చేయనున్నారు.