తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు దొంగతనానికి గురైంది. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దాంతో భక్తుల సందడి ఎక్కువగా ఉంది. ఈ సమయంలో గుర్తు తెలియని కొందరు దుండగులు ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో తిరుమలలోని టీటీడీ డిపోలో ఉంచిన ఎలక్ట్రికల్ బస్సును ఎత్తుకెళ్ళారు. ఈ బస్సు తిరుమల జీఎన్సీ టోల్ గేట్ మీదుగా వెళ్లింది. ఆ సమయంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది బస్సును ఆపలేదు. కాగా.. బస్సు కనిపించకపోవడంతో ఉదయం నుండి తిరుమలలోని అన్ని ప్రాంతాలను తనిఖీ చేసిన సిబ్బంది.. బస్సు చోరీకి గురైనట్లు నిర్ధారణకు వచ్చి తిరుమల క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. జీపీఎస్ ఆధారంగా బస్సు కదలికలను గుర్తించారు. బస్సు తిరుపతి జిల్లా, నాయుడుపేట వద్ద ఉన్నట్లు క్రైం పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి బస్సును స్వాధీనం చేసుకున్నారు. అయితే బస్సులో చార్జింగ్ అయిపోవడం వల్లే దుండగులు బస్సును వదిలివెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Read Also: రౌడీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఓటీటీలోకి ‘ఖుషి’..
గతంలో వైవీ.సుబ్బారెడ్డి పాలక మండలి చైర్మన్గా ఉన్న సమయంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. ఒక్క ఎలక్ట్రిక్ బస్సు ఖరీదు దాదాపు రెండు కోట్ల రూపాయలు వరకూ ఉంటుంది. సబ్సిడీతో కేవలం నలభై లక్షలకే టీటీడీ ఈ బస్సులను కొనుగోలు చేసింది.