హైదరాబాద్: గుమ్మినిండా వడ్లుండాలె, గూటమోలే పిల్లలుండాలంటే ఎట్ల. ఇదేం ఆలోచన విధానమని అని రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రూపాయి అప్పుచేసి, వెయ్యి రూపాయల ఆస్తిని సృష్టించామని స్పష్టం చేశారు. శ్వేతపత్రం పేరిట హామీలు, గ్యారెంటీల ఎగవేత ప్రయత్నమా? అని నిలదీశారు. ఇది గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నమన్నారు. కొన్ని విషయాలను విస్మరించి పూర్తిగా తమకు అనుకూలంగా శ్వేతపత్రాన్ని తయారు చేయించుకున్నారని ఆరోపించారు.
Also Read.. పోలీస్ ఆఫీసర్ గా సరికొత్త గెటప్ లో యంగ్ రెబల్ స్టార్…!!
గత పదేండ్లలో తెలంగాణ చాలా రంగాల్లో ప్రగతి సాధించిందన్నారు. వాటిని ఈ రిపోర్టులో ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక, రిటైర్డ్ అధికారి, సస్పెండైన ఏపీ అధికారులతో శ్వేతపత్రాన్ని సిద్ధం చేయించారని ఆరోపించారు. రాష్ట్ర కీర్తిని మసకబారేలా ప్రచారం చేయొద్దని, కీర్తినిపెంచే ప్రయత్నం చేయాలని హితవు పలికారు.
అప్పు తెచ్చిన ప్రతిపైసాను భవిష్యత్తు తరాల కోసం ఖర్చు చేశామన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం, అభివృద్ధి యజ్ఞం కోసం నిధులు సమీకరిస్తే తప్పవుతుందా? తెచ్చిన పైసలతో ఏం చేసినం? సాగునీటి ప్రాజెక్టులు కట్టినట్లు తెలిపారు. రైతుల గుండెల్లో భరోసా నింపినం. 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా వ్యవసాయానికి అందిస్తున్నాం. రహదారులు, బ్రిడ్జీలు, భవనాలు, జిల్లా కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, పాఠశాలల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినం. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు నిర్మించినట్లు వివరించారు.
Also Read… పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
2004-14 వరకు పదేండ్లలో తెలంగాణ ప్రాంతం కోసం కేవలం రూ.54,052 కోట్లు మూలధన వ్యయం చేస్తే, 2014-23 వరకు బీఆర్ఎస్ పాలనలో రూ.3,36,916 కోట్లు మూలధన వ్యయం చేసిందన్నారు. ఆర్బీఐ నివేదికల ప్రకారం అప్పులు తకువగా తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని హరీశ్రావు గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పరిమాణాన్ని పెద్దగా చూపేందుకు, తద్వారా బీఆర్ఎస్పై బురద జల్లేందుకు మరో కుట్రపూరిత వైఖరి అనుసరిస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలించిన రాజస్థాన్లో 2022-23 రూ.5,37,013 కోట్ల అప్పు, కర్ణాటకలో రూ.5,35,157 కోట్లు ఉన్నాయని, ఆ వివరాలను మాత్రం వెల్లడించలేదన్నారు. కార్పొరేషన్లు తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వ రుణాలుగా చిత్రీకరించి గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్రావు అన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చిననాడు ఖాళీ చిప్ప చేతికిచ్చారని నిందలేయలేదని హరీశ్రావు గుర్తుచేశారు. అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలని ప్రయత్నం చేశామని, తపనతో పనిచేసి, పనితనంతో అభివృద్ధి వైపు నడిపించామని, దేశానికి ఆదర్శంగా నిలిపామని చెప్పారు.
Also Read.. ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు ఇప్పుడు వీడియోలను నోట్స్గా షేర్ చేసుకోవచ్చు..!!
దేశానికే దిక్సూచి అయిన తెలంగాణను దివాలా తీసిందని ముద్ర వేయొద్దన్నారు. సంపద ఉన్నది. సమృద్ధి ఉన్నది. వృద్ధిరేటును పెంచండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రాజెక్టుల మీద, ప్రగతిభవన్ మీద దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. ప్రగతిభవన్లో 150 గదులున్నాయా? బుల్లెట్ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయా? 250 సీట్లున్న సినిమా థియేటర్ ఉన్నదా? అనేదానిపై ఇప్పుడు అదే ప్రగతిభవన్లో ఉంటున్న భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.