Sunday, May 19, 2024

అర్వింద్ లోక్ సభ సభ్యత్వాన్ని ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలి

spot_img

హైదరాబాద్: బీజేపీకి  చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. “మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కారుకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు దేనికి ఓటు వేసినా ఓటు పడేది మాత్రం బీజేపీకే” అని బీజేపీ ఎంపీ అర్వింద్ స్వయంగా బహిరంగంగా చెప్పారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి అన్నారు.

అరవింద్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎలక్షన్ కమిషన్ పైన అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికలు, బీజేపీ గెలుపు పైనా అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టయితే వెంటనే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి ధర్మపురి అరవింద్  లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలి. గత ఎన్నికల్లో ఎలా గెలిచాడనే దానిపై విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇప్పటికే ఎన్నికలలో బీజేపీ గెలిచిన స్థానాలు కూడా అడ్డదారిలోనే గెలిచారా అనే అనుమానాలున్నాయి.  రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానం గెలిచినా అది తప్పుడు విధానాల్లో గెలిచినదిగానే భావించాల్సి ఉంటుంది.  ఇప్పటికే దేశంలోని స్వతంత్ర సంస్థలన్ని మోడీ పూర్తిగా తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నారని.. పూర్తిగా స్వేచ్ఛగా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్ కూడా మోడీ పంజరంలోని చిలక మారిపోయిందని ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు.

ఈవీఎంల ట్యాంపరింగ్ అవకాశాలున్నాయని గతంలోనే నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు అరవింద్ మాటలతో అది పూర్తిగా నిజమేనని అనిపిస్తున్నది. కాబట్టి దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలి. లేకపోతే  ఎలక్షన్ కమిషన్ విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమేనని యావత్ దేశం భావించాల్సి ఉంటుందని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Latest News

More Articles