దేశంలో దశల వారిగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు దశల్లో భాగంగా ఇప్పటి వరకు మూడు ఫేజ్ల పోలింగ్ పూర్తయింది. మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ను ఇవాళ(బుధవారం) ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. చివరిదైన ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ్టి నుండి ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 15న నామినేషన్లను స్క్రూటీని చేయనున్నారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చింది ఎన్నికల కమిషన్.
ఏడో దశ జూన్ 1న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు రిలీజ్ కానున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లోని ఒక స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్ 9, ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13, బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్లో 3 స్థానాలకు లాస్ట్ ఫేజ్లో పోలింగ్ జరగనుంది.
ఏడో విడతలోనే ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుంది. అంతేకాదు..హిమాచల్ ప్రదేశ్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక ఇదే విడతలోనే జరగనుంది. కాంగ్రెస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ విప్ను ధిక్కరించడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక తప్పని సరైంది.
ఇది కూడా చదవండి:కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్పై కేసు నమోదు