Sunday, May 19, 2024

రాజశ్యామల అనుగ్రహంతోనే తెలంగాణ ప్రగతి

spot_img

రాజశ్యామల అమ్మవారి అనుగ్రహంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధింస్తోదని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కరెంటు కోతలు, నీటి కొరత తెలంగాణను వెంటాడతాయని అంతా భావించారని గుర్తు చేశారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఎన్నో సమస్యలను అధిగమించారని తెలిపారు. హైదరాబాదు కోకాపేటలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆదివారం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామి చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. 8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. కాకతీయుల శిల్ప కళా నైపుణ్యంతో ఆలయ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. శంకుస్థాపన సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాజశ్యామల అమ్మవారు ఆవిర్భవించాలనే సదుద్దేశంతోనే కేసీఆర్ తమ పీఠానికి రెండెకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. హైదరాబాదుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కేసీఆర్ ఆకాంక్షించారని అన్నారు. రాజశ్యామల అమ్మవారి మహిమ గురించి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబాలను అడిగితే చెబుతారని అన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠానికి ఆర్ధిక వనరులు లేకపోయినా రాజశ్యామల ఉపాసనాబలంతో ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. కలియుగంలో శక్తివంతమైన అమ్మవారు రాజశ్యామలేనని స్పష్టం చేశారు. రాజశ్యామల ఆరాధనతో మాజీ ప్రధాని పీవీతో సహా ఎంతోమంది గొప్పవారయ్యారని గుర్తు చేశారు. రాజశ్యామల పేరిట కొంతమంది ఆశాజీవులు హోమాలు, యాగాలు చేపడుతున్నారని, కానీ.. ఉపాసనా బలం, శక్తివంతమైన తంత్రశాస్త్రం తెలియకుండా అవి ఫలించవని స్పష్టం చేశారు. తెలంగాణలో రాజశ్యామల ఆలయ నిర్మాణానికి కొందరు ప్రముఖులు ముందుకొచ్చారని, కానీ భక్తులందరి భాగస్వామ్యంతోనే ఆలయ నిర్మాణం పూర్తి కావాలని భావించానని స్పష్టం చేశారు. అమ్మవారు ఏ ఒక్కరి సొత్తూ కాదని చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పవిత్ర గంగా జలాలు, అలకానంద, భాగీరధ నదుల నుండి తెప్పించిన పుణ్య జలాలను శంకుస్థాపన సమయంలో వినియోగించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే సతీష్ కుమార్, రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్, కంపెనీస్ లా ట్రిబ్యునల్ జడ్జి బద్రీనాధ్ దంపతులు తదితరులు శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు.

Latest News

More Articles