హైదరాబాద్లోని బంజారాహిల్స్లో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయర్ వేడుకలు వారి పాలిట శాపంగా మారాయి. ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున బంజారాహిల్స్లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి.. రోడ్డుపక్కన టిఫిన్ చేస్తున్న ఇద్దరిపై నుంచి దూసుకెళ్లింది. అంతేకాదు..ఆగిఉన్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతులు భీమవరంకు చెందిన ఈశ్వరీ, రావులపాలెంకు చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.