ఎవరికైనా పామును చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇక పాము కాటేస్తే.. సగం ప్రాణాలు అక్కడే పోతాయి. అలాంటిది ఓ యువకుడు మాత్రం తనను కరచిన పామును పట్టుకొని మరీ ఆస్పత్రికి వెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. మీర్జాపుర్ పరిధిలోని లాల్గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పతుల్ఖీ గ్రామానికి చెందిన సూరజ్ అనే యువకుడిని సోమవారం సాయంత్రం అతని ఇంట్లోనే ఓ పాము కాటేసింది. వెంటనే సూరజ్ భయపడకుండా తనను కాటువేసిన పామును సంచిలో బంధించాడు. చికిత్స కోసం వెంటనే దగ్గర్లోని మీర్జాపుర్ ప్రభుత్వ ఆసుపత్రికి బైక్పై వెళ్లాడు. ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుని తాను పాముకాటుకు గురయ్యానని తక్షణం ఇంజెక్షన్ ఇవ్వాలని వైద్యులను కోరాడు. తన వెంట తెచ్చిన పామును సంచిలో నుంచి తీసి ఎమర్జెన్సీ వార్డు బెడ్పై ఉంచాడు. దాన్ని చూసి తన విరుగుడు మందు ఇవ్వాలని కోరాడు. వెంటనే వైద్యులు సూరజ్కు యాంటీవీనమ్ ఇంజెక్షన్ ఇవ్వడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.