ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. ఓటమన్నది ఎరుగకుండా ప్రత్యర్థులను చిత్తుచేస్తూ దూసుకెళుతున్న భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా ఢీ అంటే ఢీ అనబోతున్నాయి. సొంతగడ్డపై మెగాటోర్నీ ఆడుతున్న రోహిత్సేన.. కివీస్ రెక్కలు విరిచి నాలుగేండ్ల క్రితం తమకు ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నది.
Read Also: ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ
కాగా.. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సెమీస్ బెర్తుకు మరింత చేరువయ్యే అవకాశముంది. తమ తొలి మ్యాచ్లో ఆసీస్ను చిత్తుచేసి ఆపై అఫ్గానిస్థాన్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, బంగ్లాదేశ్ను మట్టికరిపించిన రోహిత్సేన..కివీస్ భరతం పట్టేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్కు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య దూరం కావడం భారత్కు ఎదురు దెబ్బే అని విశ్లేషకులు అంటున్నారు.
చల్లటి వాతావరణం ఉండే ధర్మ శాలలో పరిస్థితులు పేసర్లకు అనుకూలిస్తాయి. శనివారం పిచ్పై బాగా పచ్చిక కనిపించగా.. మ్యాచ్ సమయానికి అది చాలావరకు తగ్గిపోవచ్చు. అయినా ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపే అవకాశముంది. ఇక్కడ స్పిన్నర్లకు కూడా బాగానే అవకాశముంటుంది. బ్యాటింగ్ మరీ కష్టమేమీ కాదు. కుదురుకుంటే పరుగులు చేయొచ్చు. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.