హైదరాబాద్ : 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిందే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉట్టిగనే తమకు పదవులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని హరీశ్రావు మండిపడ్డారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కాకుండానే హరీశ్రావును మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీశ్రావు తిప్పికొట్టారు.
శాసనసభ్యుడు కాకుండా తనను మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని సీఎం మాట్లాడారు. ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. చంద్రబాబు హయాంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కేంద్ర మంత్రి పదవిని కేసీఆర్ స్వచ్ఛందంగా వదులుకున్నా చరిత్ర కేసీఆర్ది టీఆర్ఎస్ పార్టీది అని హరీశ్రావు గుర్తు చేశారు. పదవులను గడ్డి పోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే అది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ఉందని పేర్కొన్నారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉందని, మేం ఏదో పదవుల కోసం పాకులాడినం అన్నట్టు సీఎం మాట్లాడడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. ఏబీవీపీలో షురువైండు.. టీఆర్ఎస్లో పని చేసిండు, తెలుగుదేశంలో పోయిండు, కాంగ్రెస్లో పోయిండు.. మరి రేపు యేడ ఉంటడో. పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి.. కానీ మాకు అట్లాంటిది ఏం లేదు అని హరీశ్రావు స్పష్టం చేశారు.