Saturday, May 18, 2024

టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే హిస్టరీ షీట్స్ ఓపెన్

spot_img

నిబద్దత, క్రమ శిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న తమ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రతి రోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలుంటాయని, పోలీస్ శాఖ సహకారంతో నేరస్థులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సిబ్బందిలో ఆత్మస్థైర్యం దెబ్బతీసే ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.

టీఎస్ఆర్టీసీ కండక్టర్లపై ఇటీవల మూడు చోట్ల మహిళలు దాడులకు పాల్పడ్డారు. హయత్ నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై నానా దుర్బాషలాడుతూ వేర్వేరుగా దాడికి దిగారు. చిల్లర విషయంలో ఒక మహిళ.. గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‎ను తీసుకోవాలని కండక్టర్ చెప్పినందుకు ఆయన సెల్ ఫోన్ లాక్కుని అసభ్యపదజాలంతో మరొక మహిళ దూషించారు. పికెట్ డిపోనకు చెందిన మహిళా కండక్టర్ పై యాదగిరిగుట్టలో కొందరు మహిళలు సాముహికంగా దాడి చేశారు. పై మూడు ఘటనలపై రాచకొండ కమిషనరేట్‌‎లోని సంబంధిత పోలీస్ స్టేషన్లలో టీఎస్ఆర్టీసీ అధికారులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ కేసుల దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

టీఎస్ఆర్టీసీ నియమావళి ప్రకారమే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. నిబంధనల మేరకే టికెట్ల జారీ ప్రక్రియను కండక్టర్లు కొనసాగిస్తున్నారు. ప్రయాణికులు ఒక వేళ టికెట్ తీసుకోకుంటే.. అది చెకింగ్‎లో గుర్తిస్తే ఆ సిబ్బంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయంలో విధిగా టికెట్ తీసుకుని సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది.

Read Also: నిరాధార ఆరోపణలు చేసి బురద జల్లే పని రేవంత్‎కు వెన్నతో పెట్టిన విద్య

మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని టీఎస్ఆర్టీసీ సిబ్బంది సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజూ సగటున 27 లక్షల మంది మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పని సరి అని సిబ్బంది చెబుతున్నా.. కొందరు ఇప్పటికీ ఫొటో కాపీలను, స్మార్ట్ ఫోన్‎లలో గుర్తింపు కార్డులను చూపిస్తున్నారు.

ఈ దాడి ఘటనలు సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేస్తున్నాయి. మహాలక్ష్మి స్కీంను వినియోగించుకోవాలంటే కచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డును సిబ్బందికి చూపించి.. విధిగా జీరో టికెట్‏ను తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ సూచిస్తోంది.

Read Also: మాణిక్కం ఠాకూర్‎పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. నోటీసులు ఎవరికి పంపాలో తెలియడం లేదా?

ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సమస్యలను సంస్థ దృష్టికి తీసుకువచ్చేందుకు కేంద్ర కార్యాలయం బస్ భవన్‎లో పటిష్టమైన వ్యవస్థను సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడ 24 గంటల పాటు అందుబాటులో ఉండే టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లైన 040-69440000, 040-23450033 కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. ఫిర్యాదులను సోషల్ మీడియా ద్వారా ద్వారా సంస్థ దృష్టికి తీసుకురావొచ్చు. అలాగే, నేరుగా సమీపంలోని డిపో కార్యాలయాలకు వెళ్లి వివరించవచ్చు. ఫిర్యాదు సంస్థ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి తగిన చర్యలను అధికారులు తీసుకుంటారు. అంతేకానీ, సహనం కొల్పోయి ఈ తరహా ఘటనలకు పాల్పడటం సరైంది కాదని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

Latest News

More Articles