జేఈఈ మెయిన్ 2024(సెషన్-2) పరీక్షల ఫైనల్ ఆన్షర్ కీ విడుదలైంది. కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ(సోమవారం) విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25న జేఈఈ మెయిన్ ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అంతకన్నా ముందే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు తమ స్కోర్ కార్డును పొందొచ్చు.
ఏప్రిల్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు దేశ వ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోర్ను పరిగణనలోకి తీసుకుని మెరిట్ లిస్ట్ ను ఎన్డీఏ విడుదల చేయనుంది.
జేఈఈ మెయిన్లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ పరీక్షకు ఏప్రిల్ 27 నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 17 నుంచి 26వ తేదీ వరకు అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతారు. మే 26న ఉదయం 9 నుంచి మ. 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలను జూన్ 9న ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి.. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా