Saturday, May 4, 2024

సీఎం కేసీఆర్ సమక్షంలో ‘బీఆర్ఎస్’లో చేరిన మహారాష్ట్ర నేతలు

spot_img

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్రకు చెందిన పలు పార్టీలకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలు, మేధావుల చేరికలు కొనసాగుతూనే వున్నాయి. శనివారం నాడు మహారాష్ట్ర కు చెందిన…మచ్చీంద్ర గుణ్వంతరావు చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది. లాతూర్ జిల్లా ఉద్గిర్ నియోజకవర్గానికి చెందిన గుణ్వంతరావు ప్రజల్లో మంచి పట్టున్న ప్రముఖ రాజకీయ నాయకుడు.

2009 లో ఉద్గిర్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీచేయగా ప్రత్యర్థిపై అత్యల్ప తేడాతో ఎమ్మెల్యే పదవి చేజారింది.   కాగా 2019 లోజరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ నుంచి లాథూర్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దిగగా.. దాదాపు 4 లక్షల మంది వోటర్ల మద్దతు ఆయనకు లభించింది.

విద్యార్థి నాయకునిగా కమ్యునిస్టు పార్టీ అనుబంధ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేసిన గుణ్వంతరావు, సామాజిక రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ, పలు కీలక పదవుల ద్వారా ప్రజాసేవ చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ, అంచెలంచలుగా ఎదుగుతూ తన రాజకీయ  ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తన ప్రజలకు అందించాలనే లక్ష్యంతో, బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రజా సంక్షేమ రైతు సంక్షేమ పాలనను, లౌకికవాద ప్రజాస్వామిక రాజకీయ పంథాకు ఆకర్షితులై,  హైద్రాబాద్ లో అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

కాగా వీరితో పాటు… ఎన్సీపీ పార్టీకి చెందిన  రాయగడ్ జిల్లా నివాసి రాహుల్ ఎస్ సాల్వి, మహద్ తాలూక కు చెందిన సిద్ధార్థ్ హటే, రాయగడ్ థానే కొంకణ్ ప్రాంతానికి చెందిన ప్రకాశ్ కె తొంబారె, రాయగడ్ కు చెందిన సామాజిక కార్యకర్త మునాఫ్ అమిర్ అధికారి, సౌత్ ముంబై కి చెందిన దేవేంద్ర సోలంకి,  నార్త్ ముంబైకి చెందిన మాజీ కార్పోరేటర్ పిఎస్ నాగ్రాజన్…తదితరులు పార్టీలో చేరారు. వీరికి బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మహారాష్ట్ర బిఆర్ఎస్ సీనియర్ నేతలు మాణిక్ కదమ్, శంకరన్న డోంగే తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles