ఐదు నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వున్నాయని తెలిపారు. తెలంగాణ ఎన్ఆర్ఐలు కేసీఆర్ వెంట నడుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై కొందరు పనికట్టుకుని విష ప్రచారం మొదలు పెట్టారు. కేసీఆర్ బస్సు యాత్రతో బయటకు వచ్చాక కాంగ్రెస్, బీజేపీ నేతల్లో భయం మొదలైందన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థుల కోసం ప్రధాని మోడీ, అమిత్ షా వచ్చి ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది అని మహేశ్ బిగాల విమర్శించారు. కేసీఆర్ బస్సు యాత్రతో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీకి 8 నుండి 12 పార్లమెంట్ స్థానాలు వస్తాయన్నారు. కేంద్రంలో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారు అని స్పష్టం చేశారు మహేశ్ బిగాల.
బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఎన్.ఆర్.ఐ లు పని చేస్తున్నారని తెలిపారు కార్యదర్శి అనిల్ కుర్మాచలం. తెలంగాణను దేశంలో తిరుగులేని రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారని అన్నారు. తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా వున్నారన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే తెలంగాణ కోసం కొట్లాడతారని తెలిపారు. రేవంత్ రెడ్డిని చూసి ఎన్.ఆర్.ఐలు జాలి పడుతున్నారని చెప్పారు అనిల్ కుర్మాచలం.
ఇది కూడా చదవండి:కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్పై కేసు నమోదు