ఓ ట్రక్కు డ్రైవర్ చేసిన తప్పిదానికి ఓ కుటుంబం బలైంది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఆదివారం ఓ కుటుంబం సికార్ జిల్లా నుంచి రణతంబోర్లోని త్రినేత్ర గణేష్ ఆలయానికి కారులో బయల్దేరింది. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు సవాయ్ మాధోపూర్ జిల్లాలోని బనాస్ నది బ్రిడ్జి సమీపంలో ఢిల్లీ- ముంబై ఎక్స్ ప్రెస్ వేపైకి రాగానే ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ముందు వెళ్తున్న ఆ ట్రక్కు ఒక్కసారిగా రాంగ్ యూ టర్న్ తీసుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తర్వాత మృతులను మనీశ్ శర్మ, అతడి భార్య అనితా శర్మ, సతీశ్ శర్మ, పూనమ్, సంతోష్, కైలాష్గా గుర్తించారు. ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మనన్, దీపాలి కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రక్కును సీజ్ చేశారు. ప్రస్తుతం ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది కచ్చితంగా బీజేపీకి ఓటు వేసినట్లే