తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించరని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. ఉమ్మడి పాలనలో సాగునీటి ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసి తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ ని ప్రజలు ఏనాడో తిరస్కరించారని, మళ్ళీ ఏ మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని నిలదీశారు. సీడబ్యూసీ సమావేశాలు పెట్టినా… ఎన్ని బహిరంగ సభలు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో చోటే లేదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను చీరిచింతకు కట్టడం ఖాయమన్నారు.
రోజుకో మాట మార్చే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎలా నమ్మాలని ఎద్దేవా చేశారు. సోనియాను రేవంత్ రెడ్డి ఒకప్పుడు బలిదేవత అన్నారని.. ఇప్పుడేమో దేవత అంటున్నారని ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లతో తెలంగాణలో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు భ్రమల్లో ఉన్నారని, అంతకంటే ఎన్నో రేట్లు మెరుగైన పథకాలు స్వరాష్ట్రంలో సీయం కేసీఆర్ సారధ్యంలో అమలవుతున్నాయని, అలాంటిది కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ ను ప్రజలు ఏనాడో తిరస్కరించారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను చీరి చింతకు కట్టడం ఖాయమని అన్నారు.