Saturday, May 18, 2024

లోక్‌సభ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌: నేటి నుంచి నామినేషన్‌లు

spot_img

ఏప్రిల్‌ 19న పోలింగ్ జరగనున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌ జారీతో ఇవాళ(బుధవారం) నుంచే నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కానుంది. బీహార్ మినహా తొలి విడత లోక్‌సభ ఎన్నికలు జరిగే మిగితా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నామినేషన్‌ దాఖలుకు ఈ నెల 27 వరకు అవకాశం ఇచ్చారు. బీహార్‌లో మాత్రం మార్చి 28 వరకు నామినేషన్‌ల దాఖలుకు అవకాశం కల్పించారు.

బీహార్‌ మినహా మిగితా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 28న నామినేషన్‌ల స్క్యూటినీ నిర్వహించనున్నారు. బీహార్‌లో మార్చి 30న నామినేషన్‌ల స్క్రూటినీ జరగనుంది. బీహార్‌ మినహా మిగితా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 30 నామినేషన్‌ల ఉపసంహరణకు తుదిగడువు. బీహార్‌లో నామినేషన్‌ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 2 వరకు అవకాశం ఇచ్చారు. జూన్‌ 6తో సాధారణ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణంగా ముగియనుంది.

తొలి విడతలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అందులో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, రాజస్థాన్లోని 12 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 8 స్థానాలు, మధ్యప్రదేశ్‌లోని 6 స్థానాలు, ఉత్తరాఖండ్‌, అస్సం, మహారాష్ట్రల్లోని ఐదేసి స్థానాలు, బీహార్‌లోని నాలుగు స్థానాలు, పశ్చిమబెంగాల్‌లోని మూడు స్థానాలు, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయ రాష్ట్రాల్లోని రెండేసి స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌ దీవులు, జమ్ముకశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లోని ఒక్కో స్థానం ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్‌, జూన్‌ 1న తుది విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు  విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: నన్ను క్షమించండి..క్షమాపణ కోరిన కేంద్రమంత్రి.!

 

 

 

Latest News

More Articles