ఓ బీజేపీ మహిళా ఎంపీ అభ్యర్థి వంటింటికే పరిమితం కావాలన్న కాంగ్రెస్ సీనియర్ నేతపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని దావణగెరే లోక్ సభ బీజేపీ అభ్యర్థి గాయత్రిని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గాయత్రికి మాట్లాడటం సరిగా రాదని, కేవలం ఆమెకు కిచెన్లో వంట ఎలా చేయాలో మాత్రమే తెలుసునని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సైనా నెహ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలు వంట గదికే పరిమితమవ్వాలట… కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకరప్ప చెబుతున్నారు… అమ్మాయిలు పోరాడగలరు అని చెప్పే పార్టీ నుంచి ఇలాంటివి ఊహించలేదని విమర్శించారు. తాను మైదానంలో భారత్ తరఫున ఆడినప్పుడు… పతకాలు సాధించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించింది? అని ప్రశ్నించారు. నేను ఎలా ఉంటే బాగుండేది? అని ఫైర్ అయ్యారు. ఓ వైపు నారీ శక్తికి వందనం అంటుంటే… ప్రధాని మోడీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం చెబుతుంటే… మరోవైపు స్త్రీద్వేషుల నుంచి మహిళలకు అవమానం జరుగుతోందన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన అంశమన్నారు సైనా నెహ్వాల్.
ఇది కూడా చదవండి: బాగా ఆలోచించే బీఆర్ఎస్ లో చేరాను