Wednesday, May 22, 2024

ఢిల్లీలో రూ. 2 వేల కోట్ల డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

spot_img

దేశంలో మరో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. ఢీల్లీ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్‌ నెట్‌వర్క్ ను అధికారులు చేధించారు. ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది.

సూడోపెడ్రిన్‌కు ఇతర దేశాల్లో డిమాండ్‌ ఎక్కువ. మెథాంఫేటమిన్ తయారీలో దీన్ని వినియోగిస్తారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలో కిలో రూ. 1.5 కోట్లకు అమ్ముతారు. ఆ దేశాలకు పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్‌ పంపుతున్నట్లు ఎన్‌సీబీ సమాచారం అందుకుంది. దీనిని హెల్త్‌ మిక్స్‌ పౌడర్స్‌, కొబ్బరి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి సముద్ర మార్గాల్లో రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ డ్రగ్‌ మాఫియా కదలికలపై ఎన్‌సీబీ నిఘా పెట్టింది.

ఈ క్రమంలోనే సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 15న పశ్చిమ దిల్లీలోని దారాపుర్‌లోని గోదాంలో తనిఖీ చేపట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్‌ భారత్‌ సహా మలేషియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు విచారణలో తేలింది.

ఈ ముఠా ఇప్పటి వరకు 3,500 కిలోల సూడోఫెడ్రిన్‌తో ఉన్న 45 పార్శిళ్లను ఎగుమతి చేశారని.. దీని విలువ రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే అతడి ఫొటోను విడుదల చేస్తామని పోలీస్‌ అధికారులు చెప్పారు.

ఇది కూడా చదవండి: అందరికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్న సీఎం రేవంత్.. ఇప్పుడు కొందరికే అంటున్నడు

Latest News

More Articles