జనగామ జిల్లా : జనగామ జిల్లా కేంద్రానికి చెందిన గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై తను ఒక గవర్నర్ అని మర్చిపోయి గణతంత్ర దినోత్సవ వేడుకల వేదికపై ఒక రాజకీయ వేదికలాగా మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. గవర్నర్ మాటలు బీజేపీ పార్టీ ప్రతినిధిలా భావిస్తున్నామని తెలిపారు. ఆమె వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తరుఫున ఖండిస్తున్నట్లు తెలిపారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
రాజ్యాంగం పట్ల అవగాహన లేని వారిని గవర్నర్ ను చేస్తే ఏ విధంగా ఉంటుందో దానికి నిదర్శనమే తమిళిసై. ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేని ఇలాంటి గవర్నర్లను నియమించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇలాంటి గవర్నర్ ఉండటం కన్నా మొత్తం గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. గవర్నర్ వ్యవస్థలో ఉండి ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదు, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.