దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్లో భారత కుర్రాళ్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా సూపర్ సిక్స్ పోరులో కివీస్ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 295 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ను 81 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో 214 పరుగుల భారీ తేడాతో యువ భారత్ ఘన విజయకేతనం ఎగురవేసింది. భారత బ్యాటర్ ముషీర్ ఖాన్ (131) సెంచరీతో చెలరేగగా.. బౌలర్లలో సౌమి పాండే 4 వికెట్లు తీసి భారత విజయంలో కీలక భూమిక వహించారు.
కివీస్ జట్టులో నలుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే పరిమితమవగా.. కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ 19 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. నలుగురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. కివీస్ను నమన్ తివారి (1-19), రాజ్ లింబాని (2-17), ముషీర్ ఖాన్ (2-10) కోలుకోనీయకుండా చేశారు. ఆ తర్వాత స్పిన్నర్ సౌమి పాండే మిగతా పనిని పూర్తి చేశాడు. ఈ విజయంతో భారత్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 2న నేపాల్తో భారత్ తన తదుపరి మ్యాచ్ ఆడనుంది.
Also Read.. పనిచేసే యువతిపై సెలూన్ యజమాని అత్యాచార యత్నం..శానిటైజర్ తాగి ఆత్మహత్య