తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రతో ఈ నిమజ్జన వేడుకలు మొదలయ్యాయి. హైదరాబాద్ అందాలకు మరింత సోగసులు అద్దుతూ అందంగా మెరిసిపోతున్న నూతన సెక్రటేరియట్ భవనం, తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన అమర జ్యోతి అందాల మధ్యలోంచి ఆ మూషిక వాహనుడు వెళుతుంటే చూసేందుకు భక్తుల రెండుకళ్లు చాలలేవని అనడం అతిశయోక్తి కాదు.
గణనాథుడి శోబాయాత్ర కోసం నిర్వహకులతో పాటు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసాయి. దీంతో అనుకున్న సమయానికి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యింది. సాగర తీరానికి చేరుకున్న బడా గణేషుడి విగ్రహాన్ని ప్రత్యేక క్రేన్ ద్వారా నీటిలోకి దింపి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవతంగా ముగించారు. హుస్సేన్ సాగర్ అందాలను రెట్టింపుచేస్తూ ఖైరతాబాద్ గణనాథుడు సెక్రటేరియట్ ఆవరణలోకి ఎంటర్ అవ్వగానే ఫోటోగ్రాఫర్స్ తమ కళ్ళకు పనిచేస్తూ అపురూప దృశ్యాలను క్లిక్ చేశారు. ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు.