హైదరాబాద్: తమ 114 మంది అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మిగతా ఐదుగురు అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కాంగ్రెస్ కు 40 చోట్ల అభ్యర్థులే లేరు ..అలాంటపుడు 70 చోట్ల గెలుస్తాం అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పాత రంగారెడ్డి కలిపి 29 సీట్లు ..ఇక్కడ 25 చోట్ల అభ్యర్థులు లేరన్నారు. డబ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్య కాంగ్రెస్ నేత ఒకాయన కలిశారని, కూకట్ పల్లి సీట్ కోసం ఆయన్ను 15 కోట్ల రూపాయలు అడిగారని తెలిపారు. గతం లో తాను చేప్పినట్టే కర్ణాటక లో అక్రమ డబ్బు జమ అవుతోందన్నారు. అక్కడ స్క్వేర్ ఫీట్ కు 500 వసూలు చేస్తున్నారని విమర్శించారు.
Also Read.. వందల కోట్ల పంపిణీ.. ముఠా నాయకుడు రేవంత్ రెడ్డే!!
‘‘తెలంగాణ కు తరలించడానికి సిద్ధంగా ఉన్న 42 కోట్ల రూపాయలు కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో దొరికింది. 8 కోట్లు ఇదివరకే కొడంగల్ కు చేరినట్టు మాకు సమాచారం ఉంది. కాంగ్రెస్ సిద్ధాంతం ప్రాతిపదికన ఎన్నికలు కొట్లాడటం లేదు. మేము తొమ్మిదిన్నరేళ్ళు గా చేసిన పనుల గురించి చెబుతున్నాం. ప్రోగ్రెస్ రిపోర్టు లాగా ప్రజలకు అన్నీ వివరిస్తున్నాం. మా కంటే మెరుగైన పాలనా నమూనా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? నీతి ఆయోగ్, ఆర్బీఐ రిపోర్టులు, అన్నీ సూచీల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది.
Also Read.. కాంగ్రెస్కు భారీ షాక్.. పీసీపీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
అమిత్ షా అబద్ధాలకు హద్దే లేదు. అమిత్ షా మా పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. ప్రధాని ఎక్కడికి పోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం అని తిడుతారు. ప్రధానికి అంత అహంకారమా. రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్. ఏం రాసిస్తే అది చదువుతారు. ఈ ఎన్నికలు తెలంగాణ గల్లీ ఆత్మగౌరవానికి ఢిల్లీ గుజరాత్ అహంకారానికి మధ్య పోటీ. తెలంగాణకు గుజరాత్, ఢిల్లీ అహంకారానికి మధ్య పోటీ.
పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరతానంటే ఆయన ఇంటికీ రేపే వెళ్లి ఆహ్వానం పలుకతా. బీజేపీని వాళ్ళ నాయకత్వం వాళ్ళే సీరియస్ గా తీసుకోవడం లేదు. బీజేపీకి ఈ సారి కూడా 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయం. బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుంది. సీఎం కేసీఆర్ ఈ సారి కూడా వంద స్థానాల్లో ప్రచారం చేస్తున్నారు. నేను జీహెచ్ఎంసీ, సిరిసిల్లాతో పాటు కామారెడ్డి ప్రచారం చేస్తాను.
Also Read.. కేసీఆర్ లేని తెలంగాణ అంటే నెర్రలు వారిన తెలంగాణనే
మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తాం. అట్టడుగు వర్గాలకు బీఆర్ఎస్ ఊత కర్రలా ఉంటుంది. ఆర్థిక క్రమ శిక్షణలో మేమే ముందు ఉన్నాం. ఏదీ సాధ్యమో, ఏదీ అసాధ్యమో మేము ప్రభుత్వంలో ఉన్నాం. కనుక మాకు తెలుసు. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ లో స్వతంత్రంగా పని చేస్తుందని భావిస్తున్నా. నేను వ్యక్తిగతంగా సిరిసిల్లలో ఓటర్లకు డబ్బు మద్యం పంపిణీ చేయొద్దని నిర్ణయించా..మిగతా వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళిష్టం.
కాంగ్రెస్ 2004 ,2009 లలో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. మేము 95 శాతం వరకు మా మేనిఫెస్టో లోని హామీలు నిలబెట్టుకున్నాం. రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లగలుగుతారు అనే అంశం పైనే ఎన్నికలు జరుగుతాయి. మతం, కులం ప్రాతిపదికన ఓట్లు కొంత వరకే పడతాయి. బీజేపీతో మాకు పొత్తుంటే ఇన్ని మైనారిటీ స్కూళ్ళు ,కాలేజీ లు ఎందుకు పెడతాం.
Also Read.. అప్లికేషన్లకు డబ్బులు, టికెట్కు డబ్బులు, కర్నాటక నుంచి డబ్బులు.. ఇదీ కాంగ్రెస్
సీఎం కేసీఆర్ మోడీని తిట్టినంతగా ఏ సీఎం తిట్టలేదు. బీజేపీతో స్నేహం ఉంటె ఎందుకు తిడతాం. మేము ప్రతీకార రాజకీయాలు చేయటం లేదు. మేము ఎవరేమన్నా అతి మంచితనంతో వెళుతున్నాం. రేవంత్ అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం ఐటీ,ఈడీ దాడులు ఎందుకు చేయటం లేదు. మా మీదనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి. ఓటుకు నోటు కేసును ఓపెన్ చేయండి.. ఎవరు వద్దన్నారు. ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించేది ప్రజలే..అధికారులు కాదు.
అధికారుల బదిలీలను బదిలీలలుగా గానే చూస్తాం. ప్రజలు ఓటేసేపుడు సీఎం ఎవరుంటారు అని చూస్తారు. కేసీఆర్ పాలన తీరు పైనే ప్రజలు తీర్పు ఇస్తారు. మేము చేసింది చెప్పుకుంటాం. గతంలో వచ్చినట్టే మాకు 88 సీట్లు రావచ్చు. హుజురాబాద్ లో కూడా మేమే గెలుస్తున్నాం. ఈటెల రాజేందర్ గజ్వెల్ లోనే కాదు ఇంకా 50 చోట్ల పోటీ చేసినా అభ్యంతరం లేదు. బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేరేమో. షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా అభ్యంతరం లేదు. రాహుల్ గాంధీ, మోడీలు కూడా ఇక్కడ కొచ్చి పోటీ చేసినా అభ్యంతరం లేదు. త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆర్ఎస్ లో చేరతారు. కాంగ్రెస్ లో టికెట్ ల ప్రకటన తర్వాత గాంధీ భవన్ లో తన్నుకుంటారు. కాంగ్రెస్ అంటే గందర గోళం, ఆగమాగం. కాంగ్రెస్ లో అపుడే సీఎం పదవికి ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్టు నాకు సమాచారం ఉంది. గతంలో ఉత్తమ్ మాట్లాడినట్టే రేవంత్ మాట్లాడుతున్నారు.