జనగామా అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఖమ్మం-వరంగల్-నల్లగొండ నియోజకవర్గ పట్టభ్రదుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే పల్లా రాజేశ్వర్రెడ్డి ఇటీవల జనగామ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆ స్థానానికి జూన్ 8వ తేదీలోపు ఉప ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం లేఖ రాశారు.
Read Also: ఆకలితో బిర్యానీ ఆర్డర్ చేసి తింటుంటే ఏం వచ్చిందో తెలుసా?
ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీని అర్హత తేదీగా ప్రకటిస్తూ.. గ్రాడ్యుయేట్ల కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలని సూచించింది. నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తయి మూడేండ్లు నిండినవారు ఓటు వేసేందుకు అర్హులుగా పేర్కొన్నది. ఉప ఎన్నికకు సంబంధించి శనివారం పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని, జనవరి 15న పత్రికల్లో ఒకసారి, 25న మరోసారి ఎన్నికల నిబంధనలపై పత్రిక ప్రకటన ఇవ్వాలని తెలిపింది. ఫిబ్రవరి 6న ఫామ్-18 దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీగా ప్రకటించింది. ఫిబ్రవరి 21న తాత్కాలిక ఎన్నికల ముసాయిదాను తయారు చేసుకోవాలని, 24 నుంచి మార్చి 14వరకు అభ్యంతరాలను స్వీకరించటం, ఏప్రిల్ 4 నాటికి సవరణలతో కూడిన తుది ఎన్నికల ముసాయిదాను ప్రచురించాలని వెల్లడించింది. దాంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికకు సిద్ధమవుతోంది.